ఏపీలో వైసీపీ ఏకైక ప్రతిపక్షమని జగన్ అనుకుంటున్నారు కనుక ఆయన సిఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు.
కానీ ఏపీలో నేను కూడా ఉన్నానని గుర్తుచేస్తూ షర్మిల కూడా విమర్శిస్తుంటారు. ఆస్తుల పంపకాల విషయంలో అన్నా చెల్లెలు కోర్టులకు వెళ్ళారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఇద్దరిదీ ఒకటే మాట… ఒకటే బాట!
నిన్న అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ జరుగుతుంటే దానిపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికి జగన్ తాడేపల్లి ప్యాలస్ ప్రెస్మీట్ పేరుతో ఓ గంటసేపు తన మనసులో అక్రోశాన్ని వెళ్ళగ్రక్కారు. దాంతో ఆయనకు కంఠశోష మిగిలిందే తప్ప సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాకుండా ఆపలేకపోయారు.
ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా అన్న విమర్శలనే వల్లెవేస్తూ చంద్రబాబు నాయుడుని విమర్శించారు. సిఎం చంద్రబాబు నాయుడు ఒక్కటంటే ఒక్క హామీ సరిగా అమలుచేయలేకపోతున్నారని, అమలుచేయాల్సిన హామీలు ఇంకా చాలా ఉన్నాయంటూ షర్మిల విమర్శించారు.
చంద్రబాబు నాయుడుపై ఇన్ని విమర్శలు చేస్తున్న షర్మిల కాంగ్రెస్ అధిష్టానం తనకు అప్పజెప్పిన పదవికి ఏమైనా న్యాయం చేయగలిగారా? ఎన్నికలలో స్వయంగా ఓడిపోయారు. ఒక్కరినీ కూడా గెలిపించుకోలేకపోయారు.
ఈ ఏడాదిన్నర సమయంలో వైసీపీ నుంచి ఒక్క సీనియర్ నాయకుడుని ఆమె కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించగలిగారా? అంటే అదీ లేదు!
అసలు తన రాజకీయ భవిష్యత్ ఏవిదంగా ఉంటుందో తెలీని పరిస్థితిలో ఉన్న షర్మిల, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ని ఏపీలో ఏవిదంగా ముందుకు తీసుకువెళ్ళగలరు? అని ఆలోచిస్తే ఆమె పరిస్థితి, పార్టీ పరిస్థితి అర్ధమవుతుంది.
ఈసారి 175/175కి మనవే అంటూ విర్రవీగి 11 సీట్లతో చతికిలపడిన జగన్, కాంగ్రెస్ పార్టీ పేరుతో రాజకీయ కాలక్షేపం చేస్తున్న షర్మిల సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుంటే నవ్వుకోకుండా ఉండగలమా?







