ఇదేమీ యావత్ ప్రపంచ దేశాలను కలవర పెడుతున్న ట్రంప్ సుంకాలు కావు… హెచ్-1బీ వీసా అంతకంటే కాదు… కానీ తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడమే అతి పెద్ద సమస్య అని జగన్ భావిస్తున్నారు. కనుక ఈ మేరకు హైకోర్టులో పిటిష న్ వేశారు.
దాని విచారణ పూర్తికాక ముందే మరో పిటిషన్ వేశారు. రెండు కేసులలో స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొని వారికి నోటీసులు ఇప్పించారు. హైకోర్టు వారికి నోటీసులు పంపింది కనుక వారు ముద్దాయిలే అన్నట్లు తన సొంత మీడియాలో వ్రాయిస్తున్నారు!
ఈ కేసు తదుపరి విచారణని హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
తనకు 11 మంది మాత్రమే ఉన్నారని, శాసనసభలో పార్టీల బలాన్ని బట్టి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లభిస్తుందని జగన్కు తెలిసి ఉన్నా హోదా కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు.
తనకు హోదా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్న జగన్, శాసనసభ సమావేశాలకు వెళ్ళకుండా, స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శిని నిందిస్తుండటం రాజకీయం చేయడమే కదా?
ఈ కేసు వంకతో జగన్ శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా తప్పించుకోవచ్చు లేదా ప్రభుత్వాన్ని నిందించవచ్చు.
కానీ రేపు ఏదో రోజున హైకోర్టు ఈ కేసు విచారణ చేపట్టినప్పుడు 11 మంది ఉన్న వైసీపీకి హోదా కుదరదని చెప్పవచ్చు. లేదా శాసనసభ సమావేశాలకు వెళ్ళని మీకు హోదా ఎందుకని అడగవచ్చు. లేదా స్పీకర్ నిర్ణయంపై తాము జోక్యం చేసుకోలేము, మార్చలేమని చెప్పవచ్చు. అప్పుడు పోయేది జగన్ పరువే కదా?
ఈ వ్యవహారంలో జగన్ తాను చాలా తెలివిగా వ్యవహరిస్తున్నానని, వాదిస్తున్నానని అనుకుంటున్నట్లున్నారు. కానీ కూటమి ప్రభుత్వం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారు శాసనసభ సమావేశాలకు రావడం లేదని పదే పదే చెపుతున్న మాటలు ప్రజలు వింటున్నారు కదా?ఇద్దరిలో ఎవరి వాదన ప్రజలకు బలంగా చేరుతోంది? దాని పర్యవసానాలు ఏమిటి? అని ఆలోచిస్తే మంచిదేమో?







