మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు నేటి నుంచి 40 రోజుల పాటుఆ పార్టీ నేతలు ప్రజల మధ్యకు రాబోతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం ప్రకటించించి ప్యాలస్లో నేడు పోస్టర్స్ ఆవిష్కరించారు.
మెడికల్ కాలేజీలను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించి, నిర్వహించడం తప్పు కాదు. చట్ట విరుద్దం కాదు. వాటిని ఏర్పాటు చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చవడం కంటే ఎదో విదంగా నిర్మించడమే మంచిది. ఇప్పుడు వద్దనుకున్న ఆ మెడికల్ కాలేజీలనే రేపు అందరూ మెచ్చుకుంటారు. వినియోగించుకుంటారు. వాటిని నిర్మించినందుకు ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు. అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు వైసీపీ పట్ల వ్యతిరేకత చూపుతారు కూడా. కనుక ఇదో అనాలోచిత పోరాటమే అని చెప్పవచ్చు.
ఏపీ ప్రభుత్వం ఇప్పటికే దీనిపై తుది నిర్ణయం తీసుకుంది. కనుక వైసీపీ కోటి సంతకాలు కాదు… ముక్కోటి సంతకాలు సేకరించినా ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చలేదు. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని వైసీపీ చెప్పుకుంటోంది. కనుక అది అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో మరో పదో పాతికో మెడికల్ కాలేజీలు నిర్మించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవచ్చు కదా?
కానీ ఇప్పుడే వీటి కోసం ఎందుకు ఇంత ఆరాటపడుతోంది? దీని వలన వైసీపీకి ఏం ప్రయోజనం అంటే ఈ పేరుతో 40 రోజులు పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి పనిచేస్తారు. కనుక వారిలో కొత్త ఉత్సాహం కలుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ శ్రేణులను చురుకుగా ఉంచడం చాలా అవసరమే. కనుక ఈ హడావుడి దాని కోసమే అనుకోవచ్చు.




